నకిలీ వీసాలు....ఉద్యోగాల పేరుతో మోసాలు
14 పాస్ పోర్టులు,14 నకిలీ వీసాల తో పాటు తయారీ సామగ్రి స్వాధీనం
నకిలీ వీసాల తయారీ ముఠా గుట్టును రట్టు చేసిన శంషాబాద్ ఎస్ ఓ టి,ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్, ఆర్.జి.ఐ.ఏ పోలీస్ బృందం
ఇద్దరు నిందితుల అరెస్టు, పరారీలో మరో ముగ్గురు నిందితులు
శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ వీసాలతో దుబాయ్ వెళుతూ పట్టుబడ్డ 8 మంది ప్రయాణికులు
నిందితులు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు హైదరాబాద్ వాసులుగా గుర్తించిన పోలీసులు
శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మీడియా సమావేశం
రాజేంద్రనగర్, మే16,(నగరనిజం ప్రతినిధి) : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని నకిలీ వీసాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు శంషాబాద్ ఎస్ఓటి టీమ్స్ మరియు విమానాశ్రయం పోలీసులు. ఈ మేరకు జాయింట్ ఆపరేషన్ ద్వారా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.... వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో పాస్ పోర్టులు, నకిలీ వీసాల తో పాటు వీసాల తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ ప్రకటించారు. మరోవైపు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు. ఈ మేరకు గురువారం నాడు శంషాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నకిలీ వీసాల తయారీ ముఠా అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడిరచారు ఏసీపీ శ్రీకాంత్ గౌడ్. శ్రీకాంత్ గౌడ్ కథనం ప్రకారం నకిలీ వీసాల తయారీ.... ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.నిరక్షరాస్యులైన అమాయకులను లక్ష్యంగా చేసుకొని వారికి నకిలీ వీసాలను అంటగడుతూ గల్ఫ్ దేశాలకు పంపి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును రట్టు చేశారు శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు. నకిలీ వీసాలతో గల్ఫ్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన 8 మంది ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని వెస్ట్ గోదావరి జిల్లా లోని రామన్నపాలెం గ్రామానికి చెందిన సత్యనారాయణ, రాఘవేంద్ర నగర్ పెనుగొండ గ్రామానికి చెందిన చిలుకూరి బాలాజీ(43), హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన పెనెగలపాటి అంజి అలియాస్ రామానుజనేయులు, అన్నమయ్య జిల్లా లోని చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన సుంకర శివకుమార్, కడప జిల్లా లోని రాయచోటి ప్రాంతానికి చెందిన గోపాల్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే నిరక్షరాస్యులైన అమాయకులను లక్ష్యంగా చేసుకొన్న వీరు.... గల్ఫ్ లో ఉద్యోగాల పేరుతోనకిలీ వీసాల తయారీ దందాకు తెరలేపారు. ఈ మేరకు తప్పుడు దృవపత్రాలతో నకిలీ వీసాలు తయారు చేసే ఈ ముఠా.... ఉద్యోగాల ఎర వేసి వారికివిజిటింగ్ వీసాలు అంటగట్టి గల్ఫ్ దేశాలకు పంపించడం వృత్తిగా ఎంచుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని నాంపల్లి ప్రాంతాల్లో పలు హోటల్స్ ను అడ్డాగా చేసుకుని గత కొంతకాలంగా వీరు ఈ దందాను సాగిస్తున్నారు.ఇందుకోసం ఒక్కో ప్రయాణికుడి నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ క్రమంలో 8 మంది అమాయకులకు ఉద్యోగాల పేరుతోనకిలీ వీసాలు అంటగట్టి దుబాయ్ కి పంపించేందుకు ప్రయత్నించారు. వీరి మోసాలు గ్రహించలేకపోయిన అమాయకులు నకిలీ వీసాలు పట్టుకొని ఎడారి దేశానికి ఎగిరిపోవడానికి మే 14వ తేదీన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.అయితే శంషాబాద్ విమానాశ్రయంలో వీరి వీసాలను పరిశీలించిన అధికారులు.... వారి వద్ద ఉన్నవి ఫేక్ వీసాలుగా గుర్తించారు. దీంతో ప్రయాణికులను అదుపులోకి తీసుకొని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఔట్ పోస్టు పోలీసులకు అప్పగించారు.ఈ నేపథ్యంలో శంషాబాద్ జోన్ డీసీపీ బి.రాజేష్, సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ పి.శోభన్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్.ఓ.టి అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి,అడిషనల్ డీసీపీ కె ఎస్ రావు, శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షణలోరంగంలోకి దిగిన ఎస్ఓటి టీమ్స్, ఎయిర్ పోర్ట్, ఆర్.జి.ఐ.ఏ పోలీసులు.... పట్టుబడ్డ ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారించడంతో నకిలీ వీసాల తయారీ ముఠా గుట్టు రట్టయింది.ఈ మేరకు ఐదుగురు నిందితుల్లో ఏ3 నిందితుడిగా ఉన్న వెస్ట్ గోదావరి వాసి చిలుకూరి బాలాజీ తో పాటు అన్నమయ్య జిల్లాకు చెందిన ఏ 4 నిందితుడు సుంకర శివకుమార్ ను హైదరాబాద్ నాంపల్లిలోని త్రీ క్యాస్టల్ హోటల్లో అరెస్టు చేసినట్లు శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ ప్రకటించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు సత్యనారాయణ, అంజి, గోపాల్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఆయన వివరించారు. పట్టుబడ్డ నిందితుల వద్ద నుండి 14 పాస్ పోర్టులు , 14 నకిలీ వీసాలు, 16 విమాన ప్రయాణ టికెట్లు, 2 నకిలీ స్టాంపులు, స్టాంప్ పాడ్, లాప్టాప్ తో పాటు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడిరచారు. .ఎస్ఓటి టీమ్స్ మరియు పోలీసులకు ఏసీపీ ప్రశంస మరోవైపు నకిలీ వీసాల తయారీ ముఠా గుట్టును రట్టు చేసిన శంషాబాద్ ఎస్ఓటి టీమ్స్ తోపాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔట్ పోస్ట్, ఆర్జిఐఏ పోలీసులను ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ అభినందించారు. ఈ మేరకు ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్, ఔట్ పోస్ట్ పోస్ట్ పీఎస్ ఇన్స్పెక్టర్ జె.బాలరాజు, ఆర్.జి.ఐ.ఏ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే బాలరాజు, ఎస్ఓటి ఎస్సై తరుణ్ రెడ్డి,ఎస్సై సిద్ధేశ్వర్ (ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్), ఎస్ఓటీపోలీస్ కానిస్టేబుల్స్ ఆంజనేయులు , వంశీకృష్ణ , జాన్సన్, ఆర్.జి.ఐ.ఏ ఔట్ పోస్ట్ పీఎస్ కానిస్టేబుల్స్ శివకుమార్, పి ధర్మారెడ్డి, కె రవికుమార్ కు ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ రివార్డులు అందజేశారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments