శంషాబాద్ లో ట్రైనీ కానిస్టేబుల్ ఘరానా మోసం
నిందితుడు పీటీఓ కానిస్టేబుల్ నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేసిన ఆర్.జి.ఐ.ఏ పోలీసులు
నిందితుడి అరెస్ట్, మూడు ప్రైవేట్ క్యాబులు సీస్
రాజేంద్రనగర్, మే 19
(నగరనిజం ప్రతినిధి):
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో ఓ ట్రైనింగ్ కానిస్టేబుల్ ఘరానా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు నిందితుడు నిస్సార్ అహ్మద్ ను అరెస్టు చేయడంతో పాటు మూడు ప్రైవేటు క్యాబులను సీజ్ చేశారు. శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం పోలీసు కానిస్టేబుల్ ఘరానా మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు నిస్సార్ అహ్మద్ (30) అనే యువకుడు గత కొంతకాలంగా శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీస్ స్టేషన్ లో పీటీఓ అండర్ ట్రైనీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శిక్షణ కాలంలోనే మనోడు రాటు తేలిపోయాడు. పోలీసు వాహనాల కోసం ప్రభుత్వం మంజూరు చేసే ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేస్తూ వాటిని ప్రైవేట్ క్యాబులకు విక్రయించి సొమ్ము చేసుకోవడం వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ నుండి 10 ఫాస్టాగ్ స్టిక్కర్లను చోరీ చేసిన నిందితుడు నిస్సార్ అహ్మద్.... వాటిని ప్రైవేట్ క్యాబులకు విక్రయించాడు. ఇందుకోసం ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించాడు.విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రైవేటు క్యాబులకు నెలకు 8000, ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించే ప్రైవేట్ క్యాబ్ వాహనాలకు 2000 చొప్పున వసూలు చేస్తున్నాడు. అయితే ఫాస్టాగ్ వ్యవహారంపై అనుమానం రావడంతో ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ మేనేజర్ శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకేముంది ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఆర్.జి.ఐ.ఏ పోలీసులు.... తీగ లాగితే డొంక కదిలిన చందంగా ట్రైనీ కానిస్టేబుల్ ఫాస్టాగ్ స్టిక్కర్ల అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి మూడు క్యాబులను సీజ్ చేసినట్లు సీఐ బాలరాజు ప్రకటించారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments