మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం
9 లక్షల సుపారితో ప్రత్యర్థిని హత్యకు పథకం రచించిన ఇమ్రాన్ ఖాన్
బాధితుడి ఫిర్యాదుతో మర్డర్ వ్యూహాన్ని భగ్నం చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు
నిందితుల వద్ద నుండి మారణాయుధాలు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన రాజేంద్రనగర్ కోర్టు
నిందితులు చంచల్ గూడ జైలుకు తరలింపు
మీడియాకు వివరాలు వెల్లడించిన మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్
రాజేంద్రనగర్, సెప్టెంబర్ 23
(నగరనిజం ప్రతినిధి):
9 లక్షల సుఫారీ ఇచ్చి ఓ వ్యక్తిని హత్య చేయడానికి పథకం రచించిన ప్రత్యర్థి వర్గం ఎత్తులను మైలార్ దేవ్ పల్లి పోలీసులు చిత్తు చేశారు. మర్డర్ స్కెచ్ ను భగ్నం చేసిన పోలీసులు..... ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి తరలించారు. పట్టుబడ్డ నిందితుల నుండి మారణాయుధాలతో పాటు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మర్డర్ కేసు వ్యూహాన్ని భగ్నం చేసి నిందితుల ఆట కట్టించిన మైలార్ దేవుపల్లి పోలీసులను సైబరాబాద్ కమీషనర్ అవినాష్ మహంతి తో పాటు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అభినందించారు.ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం మీడియాకు వివరించారు మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్. సీఐ నరేందర్ కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.....పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో నివాసముండే ఇమ్రాన్ ఖాన్ గత కొంతకాలంగా సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాల కొలుగోలు, అమ్మకాల వ్యాపారం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ తో అతని ప్రత్యర్థి వర్గీయుడికి మధ్యన గత కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏడాది క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి 50వేల డబ్బులు చెల్లించే విషయంలో గొడవలు తలెత్తడంతో కొందరు వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అప్పట్లో మైలార్ దేవ్ పల్లి పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే తన పై దాడి చేయించింది తన ప్రత్యర్థి వర్గీయులేనని నిర్ధారించుకున్న ఇమ్రాన్ ఖాన్.... ఎలాగైనా సరే వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు బార్కాస్ లో నివాసముండే ఇబ్రహీం అనే వ్యక్తిని సంప్రదించి ప్రత్యర్థిని అంతమొందించడానికి సుఫారి గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఇందుకోసం బార్కాస్ లోని ఓ స్మశాన వాటిక వద్ద సుపారి గ్యాంగుతో సమావేశమైన ఇమ్రాన్ ఖాన్.... ప్రత్యర్థిని హత్య చేస్తే 9 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంకేముంది డీల్ కుదరడంతో మహమ్మద్ సైఫ్ శ్రీరామ్ అనే మరో వ్యక్తితో కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రత్యర్థిని హత్య చేయడానికి పథకం రచించాడు.ఈ మేరకు సుఫారీ గ్యాంగుకు 60,000 అడ్వాన్స్ చెల్లించాడు. అడ్వాన్స్ చేతికందడంతో రంగంలోకి దిగిన సుపారి గ్యాంగ్....ఇందుకోసం పక్క ప్రణాళిక రచించింది. ఈ మేరకు సుఫారీ గ్యాంగ్
సోమవారం రాత్రి మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని వట్టేపల్లి నైస్ హోటల్ వద్ద మాటు వేసి ఉంది. అయితే ఇమ్రాన్ ఖాన్ సుఫారి గ్యాంగ్ చేత తనను హత్య చేయడానికి పథకం రచించాడని అతని ప్రత్యర్థి పోలీసులకు ఉప్పందించాడు. దీంతో అప్రమత్తమైన మైలార్ దేవుపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్..... సోమవారం రాత్రి తన సిబ్బందితో కలిసి హుటా హుటిన వట్టేపల్లి నైస్ హోటల్ వద్దకు చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి సుఫారి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసినట్లు మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు పట్టుపడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ తో పాటు మహమ్మద్ సైఫ్, శ్రీరామ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ నరేందర్ తెలిపారు.నిందితుల వద్ద నుండి రెండు కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. అనంతరం నిందితులను రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పర్చగా.... న్యాయస్థానం ముగ్గురు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ నరేందర్ తెలిపారు. అనంతరం నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించినట్లు సీఐ నరేందర్ ప్రకటించారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments