వ్యవసాయంలో రసాయనాలు తగ్గించాలి
వ్యవసాయంలో రసాయనాలు తగ్గించాలి
రైతు కమిషన్ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములునాయక్
పోల్కంపల్లిలో రైతు ముంగిట్లో - శాస్త్రవేత్తలు సదస్సు
ఇబ్రహీంపట్నం, మే 10 ( నగరనిజం ) : రైతులు రసాయనాలను, యూరియా వాడకాన్ని తగ్గించాలని తెలంగాణ రైతు కమిషన్ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ సభావత్ రాములునాయక్ పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు... రైతులు ఎరువులను, పురుగుమందులను అవసరం మేరకే వాడుకుంటూ, నేల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. పంటల సాగులో సరైన చర్యలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. యూరియా వాడకం తగ్గించడం వల్ల నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. పంట మార్పిడి చేయడం వల్ల చీడపీడలను తగ్గించవచ్చని తెలిపారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచనల మేరకు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. నాణ్యమైన విత్తనాలను వేసుకొని ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడితో రైతులు లాభాలు పొందాలని సూచించారు. పంట మార్పిడి పాటించి, సుస్థిర ఆదాయాన్ని పొందాలని సూచించారు. చెట్లను పెంచి, పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సునీత, శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ అధికారి విద్యాదరి, శ్రావణ్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు