హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
హయత్ నగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రధానాచార్యులు డా. పి. సురేష్ బాబు తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరానికి మొత్తం 840 సీట్లు అందుబాటులో ఉన్నాయని, వాటిలో కోర్సుల వారీగా సీట్ల వివరాలు ఇలా ఉన్నాయని వెల్లడించారు: బీఏ (ఇంగ్లీష్ మీడియం) – 120, బీఏ (తెలుగు మీడియం) – 120, బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) – 240, బీబీఏ – 60, బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) – 180, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్) – 120.కళాశాలలో విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నాక్, ఐఎస్ఓ గుర్తింపులతో కళాశాల రంగారెడ్డి జిల్లాలో ఉత్తమ స్థానంలో ఉందని తెలిపారు. కళాశాలలో ఉత్తమ గ్రంథాలయం, క్రీడల శిక్షణ, ఎన్సీసీ (నేవీ) శిక్షణ కూడా లభిస్తుందని, ప్రతి సంవత్సరం విద్యార్థులు రాష్ట్రపతి పరేడులో పాల్గొంటారని వెల్లడించారు.నిరుపేద విద్యార్థులకు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆర్థిక సహాయం అందించబడుతుందని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం కూడా సమీపంలో ఉందని తెలిపారు.దోస్త్ వెబ్సైట్ (https://dost.cgg.gov.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, కళాశాల కోడ్ 2037 అని తెలిపారు. వెబ్ ఆప్షన్ సమయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్ నగర్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ మే 3 నుండి మే 21, 2025 వరకు కొనసాగుతుందని, అడ్మిషన్లకు సంబంధించి మరిన్ని వివరాలకు దోస్త్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహను 99489 85954 నెంబరులో సంప్రదించవచ్చని తెలిపారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్